కలం, వెబ్ డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) భారీ శోభాయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడంతోపాటు, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ (Traffic Advisory) చేయనున్నారు. యాత్ర సీతారాంబాగ్లోని శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమై కోటిలోని హనుమాన్ ఆలయం వరకు కొనసాగుతుంది. యాత్ర సాగే మార్గాల్లో దాని పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలైన మంగళ్హాట్, ధూల్పేట, బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లే రోడ్లను తాత్కాలికంగా మూసివేయడం లేదా ట్రాఫిక్ను మళ్లించడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్గాలకు ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ మళ్లింపుల వల్ల ఇబ్బంది కలగకుండా ప్రధాన జంక్షన్ల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు.

