కలం,మెదక్ బ్యూరో : పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రం వరకు మెట్రో సేవలను విస్తరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ప్రభుత్వాన్ని కోరారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, దానిని సంగారెడ్డి వరకు విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉండటంతో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ రోజువారీగా హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో మెట్రో రైలు (Metro Rail) విస్తరణ చేపడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

