కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీల హక్కుల రక్షణకు, గిరిజన ప్రాంతాల సమగ్ర వికాసానికి నిరంతరం శ్రమిస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న విప్లవ వీరుడు కొమురం భీమ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జల్, జంగల్, జమీన్” నినాదంతో అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన కొమురం భీమ్ పోరాట పటిమ అందరికీ ఆదర్శనీయమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఏజెన్సీ ప్రజలు ఎదుర్కొంటున్న సుదీర్ఘ భూ సమస్యలు, పోడు భూముల వివాదాల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వెల్లడించారు. కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

