కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు (Ration Cards) అందించామన్నారు. రేషన్ కార్డు అనేది పేద వాళ్లకు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కడుతున్నామని తెలిపారు. భూమి ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తున్నామని, లేని వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ లాగా మాటలు చెప్పి తప్పించుకునే రకం కాదని, ప్రజలకు మాటిస్తే చేసి చూపిస్తామని మహేశ్ కుమార్ (TPCC Chief) సష్టం చేశారు. కేసీఆర్ దొంగ మాటలు చెప్పి పదేండ్లు కాలయాపన చేశారని విమర్శించారు. ఇక వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విశ్రాంతి తీసుకోవాలని, కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లి అక్కడే ఉండాలని చెప్పారు. జిల్లాలో ప్రజల బాగోగులు తాము చూసుకుంటామన్నారు. అధికారంలో లేని ప్రశాంత రెడ్డి గెలిస్తే మున్సిపాలిటీలో ఏం పనులు జరుగుతాయని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారిని గెలిపించుకుంటే నిధులు వస్తాయని, పనులు జరుగుతాయని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే ఇంటి ముందు కాలువలో వేసినట్టేనని, ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Read Also: కలం 360 డిగ్రీస్: మున్సిపోల్స్ స్పెషల్
Follow Us On: Instagram


