కలం, వెబ్డెస్క్: తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పర్యటనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి దేశానికి తండ్రి లాంటి వారని, రాష్ట్రాలకు సమానంగా విధులిచ్చి, నిధులిచ్చి ఆదుకోవాల్సిన హోదాలో ఉన్న వ్యక్తి అని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి కేవలం రాజకీయాలు మాట్లాడటం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని ఆరోపించారు.
రాజకీయాలు కాకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గురించి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని హితవు పలికారు. అలా కాకుండా భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తాం అని మోడీ ధీమా వ్యక్తం చేయడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వారు ప్రధానిగా కాకుండా బీజేపీని బలపరించేందుకే రాష్ట్ర పర్యటనకు వచ్చినట్లుగా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చిన బీజేపీ బలపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడంపై కూడా విమర్శలు చేశారు. సెక్యులార్ల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

