కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ (Karimnagar) పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో కీలక పురోగతి లభించింది. మొత్తం అయిదుగురు నిందితుల్లో ఇద్దరిని బెంగాల్లో పట్టుకున్న పోలీసులు నిన్న అర్ధరాత్రి కరీంనగర్ తీసుకొచ్చారు. దోపిడీ అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి మీదుగా ఉత్తరాదికి పారిపోతుండగా.. నిందితుల్లో ఒకరు తన సెల్ ఫోన్ను మద్దునూర్ వద్ద పగులగొట్టాడు. ఈ ఫోన్ స్థానిక యువకులకు దొరకడంతో పోలీసులకు అందించారు. అందులో సమాచారం విశ్లేషించగా.. కీలక ఆధారాలు లభించాయి. దీని ఆధారంగా వారం రోజులుగా నిందితుల కోసం పశ్చిమ బెంగాల్, బిహర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు.
బంగారం అమ్మడంతో..
నిందితుల్లో ఇద్దరు దోచుకున్న బంగారాన్ని బెంగాల్లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఇద్దరు నిందితులు, బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి ముగ్గురు దొరికిపోయారు. వీరి నుంచి కొంత సొత్తు కూడా రికవరీ చేశారు. మిగిలిన ముగ్గురి కోసం కరీంనగర్ పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీ దొంగల పాత డేటాతో సరిపోల్చుతూ ఆపరేషన్ చేస్తున్నారు. వారిని కూడా వీలైనంత త్వరగానే పట్టుకుంటామని చెబుతున్నారు.

