కలం, వెబ్ డెస్క్: కేసీఆర్(KCR) ఆజ్ఞ లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, బీఆర్ఎస్(BRS) హయాంలో పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని టీపీసీసీ చీఫ్(TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)తో భార్యభర్తల సంసారాల్లోకి తొంగి చూశారని, ఇప్పుడు స్వాతి ముత్యంలాగా సెంటి మెంట్ డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గత పదేళ్లలో ఆ పార్టీ చేసిన అరాచక పాలనపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరమని, ఈ కేసులో కేటీఆర్, హరీష్, సంతోష్ రావులకు ఇచ్చినట్లే కేసీఆర్కి సిట్ నోటీసులు పంపించిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ విచారణను భూతద్దంలో చూడటం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ రాజరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే నిందలు వేయడం విచారకరమన్నారు. గతంలో శిబూ సోరెన్, మాయావతి, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప వంటి ముఖ్యమంత్రులే విచారణలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ను 70 ఏళ్ల వయసులో ప్రగతి భవన్ ముందు 7 గంటలు వెయిట్ చేయించిన విషయం కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ను తీసుకెళ్లినప్పుడు వయసు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్లో (Phone Tapping Case) హస్తం ఉన్న వాళ్లంతా ఎంతంటి వారైనా శిక్షార్హులేనని వెల్లడించారు. నోటీసులు ఎవరికైనా శాశ్వత చిరునామాకే పంపిస్తారని తెలిపారు. సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ విచారణలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. సోనియా గాంధీ విచారణకు, కేసీఆర్ విచారణకు ఏం సంబంధం ఉందని టీపీసీసీ చీఫ్(TPCC Chief) ప్రశ్నించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ తో ఎవరినీ ఎదగనీయకుండా కుట్ర : ఎంపీ చామల
Follow Us On: Instagram


