కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood)లో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్క్రీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టబడుతుండగా.. దీనికి నిర్మాతలు అంగీకారం తెలపడం లేదు. దీన్ని నిరసిస్తూ.. సింగిల్ స్క్రీన్ల థియేటర్లలో సినిమాలను టికెట్ రేట్లు పెంచబోమని ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. ఈ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది.
ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజీ విధానంపై 15 మందితో కమిటీ వేయనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై సి.కల్యాణ్ మాట్లాడుతూ.. రెండు నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టంచేశారు. కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని పేర్కొన్నారు.
Read Also: ‘పెద్ది’ రిలీజ్పై ఎలాంటి డౌట్స్ లేవు: దిల్ రాజు
Follow Us On: Instagram

