కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
క్యూలైన్లలో భక్తులకు త్రాగునీరు, పాలు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలు అందిస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 44,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు ముందస్తు ప్రణాళికతో రావాలని అధికారులు సూచిస్తున్నారు.

