ఆర్‌ఓ వాటర్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా.. ఐఐటీ మద్రాస్ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్: ఇళ్లలో రివర్స్ ఆస్మాసిస్ (RO) ప్యూరిఫైయర్ ద్వారా శుద్ధి చేసిన నీటిని చాలామంది తాగుతున్నారు. నీరు ఫిల్టర్ అయిన తర్వాత నీరు కలుషితమవుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Madras) మద్రాస్ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. చెన్నైలోని వందలాది ఇండ్ల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించింది. ఆర్‌ఓ ఫిల్టర్లు సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ, ఆ తర్వాత నీటిని నిల్వ చేసే పద్ధతులు, అపరిశుభ్రమైన నిర్వహణ కారణంగా నీరు తిరిగి కలుషితమవుతున్నట్లు గుర్తించింది. పరీక్షించిన 262 శుద్ధి చేసిన నీటి నమూనాలలో 81 నమూనాలలో బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల విరేచనాలు, కడుపు తిమ్మిర్లు, వాంతులు, జ్వరం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆర్‌ఓ నీటిని ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం, పాత్రలపై మూతలు పెట్టకపోవడం, ఒకే పాత్రను సరిగ్గా కడగకుండా పదేపదే నింపడం, ఫిల్టర్ చేసే క్రమంలో శుభ్రత లోపించడం కారణంగా బ్యాక్టీరియా చేరుతున్నట్లు పరిశోధనలో తేలింది. కాలక్రమేణా వంటగది సింక్‌లు, కుళాయిలు, సరిగ్గా సర్వీసింగ్ చేయని ప్యూరిఫైయర్ వ్యవస్థలు కూడా బ్యాక్టీరియా నిలయాలుగా మారుతున్నాయని స్పష్టం చేసింది. కేవలం నీటిని శుద్ధి చేసే సాంకేతికత మాత్రమే సరిపోదని, ఫిల్టర్ చేసిన తర్వాత కూడా నీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు ఉంటేనే సురక్షితమైన తాగునీరు అందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>