కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం (Tiger Movement Jagtial) స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా రుద్రంగి, కొడిమ్యాల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు ఆధారాలు లభించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సుమారు ఇరవై రోజుల క్రితమే ఒకచోట ఆవులపై దాడి చేసి చంపి తిన్న ఘటనతో పులి ఉనికిపై స్పష్టత వచ్చింది. తాజాగా పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయా గ్రామాల్లో భయం మరింత పెరిగింది.
ప్రస్తుతం పులి అటవీ మార్గాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల విషయంలో అటవీశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కాలినడకన లేదా అటవీ మార్గాల ద్వారా కొండపైకి వెళ్లవద్దని భక్తులకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతం వైపు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పులి అడుగుజాడలను గమనిస్తున్న అధికారులు, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

