కలం, డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబుతో తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala) సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్టు మంత్రి తుమ్మల వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘భద్రాచలం నుంచి తెలంగాణ వెళ్లాలంటే ఏపీలో ఉన్న ఐదు గ్రామాల మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. కాబట్టి ఆ ఐదు ఊర్లను తెలంగాణలో కలపాలని సీఎం చంద్రబాబును కోరాం. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏడు మండలాలను ఏపీలో కలిపారు. పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలి అంటే అప్పుడు అంగీకరించాం. ఇప్పుడు తెలంగాణ కోసం ఐదు గ్రామాలను అడిగాం. దానికి రెండు రాష్ట్రాలు తీర్మాణాలు చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో చట్టం చేయాలి. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తామన్నారు. తిరుపతిలో తెలంగాణకు ఐదు ఎకరాలు కేటాయించాలని కోరాం. దానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు’ అంటూ మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.


