కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని శివగంగ ఆలయ కోనేరులో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో శర్వింద్ (7), మాన్విత్ సాయి (11), మనస్విని (8) ఉన్నారు. వీరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆలయ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెంటనే చిన్నారులను బయటకు తీసి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో కొండాపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

