కలం, వెబ్ డెస్క్: భారత్ (India) అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన, పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టించే ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని నాలుగో స్వ్కాడ్రన్ ఈ వారం చివరిలోనే అందించబోతున్నట్లు రష్యా ప్రకటించింది. ఒప్పందం ప్రకారం, ఇది వరకే ఈ వ్యవస్థ ఇండియాకు రావాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో తలమునకలైన నేపథ్యంలో.. రష్యా కొంత జాప్యం చేస్తూ వస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరుస సంప్రదింపుల తరువాత ఎట్టకేలకు ఈ వారంలోనే పంపించేందుకు క్రెమ్లిన్ అంగీకరించింది. కాగా, ఈ ఒప్పందం విలువ 3.4 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంగా దీనికి పేరుంది.
పాకిస్థాన్ను చిత్తు చేసిన ఎస్–400 వ్యవస్థ..
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ భారత్పైకి ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎస్–400 వ్యవస్థ చిత్తు చేసింది. వచ్చిన వాటిని వచ్చినట్లే.. ఆకాశంలోనే ఈ డిఫెన్స్ సిస్టం పేల్చి వేసింది. దీంతో శత్రు దేశంతో పోలిస్తే.. మనకు నష్టం చాలా తక్కువగా కలిగింది. ఈ సమయంలోనే ఎస్–400 వ్యవస్థ ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి ఈ డిఫెన్స్ సిస్టంను రష్యా నుంచి తీసుకుంటే, ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించింది. అయితే, భారత్ ఏమాత్రం బెదరకుండా ఒప్పందం కుదుర్చుకుంది. చివరికి అదే యుద్ధంలో భారత్ను పై స్థాయిలో నిలిపిందని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు.

