కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించాలని మంత్రి సీతక్క (Minister Seethakka) విజ్ఞప్తి చేశారు. కార్మికుల 32 డిమాండ్లలో దాదాపు 29 అంశాలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. కార్మికుల ప్రధాని డిమాండ్లు అయిన ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలపై సానుకూలంగా ఉన్నామని, వీటిని సాంకేతికంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్ లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల కమిటీని వేశామని, ఆ కమిటీతో చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జీతాలు జమ అవుతున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పీఆర్సీ , డీఏ బకాయిలు క్లియర్ చేసిందని చెప్పారు. కార్మికులపై భారం తగ్గించేందుకు కొత్త నియామకాలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుత సమ్మె వల్ల మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు, విద్యార్థులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల సంస్థకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని.. అది మళ్లీ కార్మికుల భవిష్యత్ కే ప్రమాదమన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆర్టీసీ కార్మికులను మంత్రి సీతక్క (Minister Seethakka) కోరారు.
Read Also: అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!
Follow Us On: Sharechat

