కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేసిన సివిల్, ఈసీఈ విభాగాల అభ్యర్థులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏఈఈ పోస్టుల భర్తీకి ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు భర్తీ చేయనుంది. అదే సమయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా 19 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ విద్యార్హతగా ఉంది. అయితే, టీపీసీబీలో ఏఈ పోస్టులకు ప్రత్యేకంగా పర్యావరణ ఇంజినీరింగ్ లో స్పెషల్ పీజీ చేసి ఉండాలి.
రూ.54 వేలతో ప్రారంభం..
మొదట అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేయబోతున్నారు. అయితే, రాత పరీక్ష ఎలా నిర్వహించబోతున్నామనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే వేతనం రూ.54 వేలుగా ఖరారు చేశారు. పదోన్నతులు దక్కే కొద్దీ వేతనాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గెజిటెడ్ హోదాతో కూడిన ఈ ఉద్యోగాలతో సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతాయి.
చివరి తేదీలు ఇవే..
సివిల్ ఏఈఈ పోస్టులకు జులై 13, ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులకు జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి అక్టోబరులో పరీక్ష నిర్వహించబోతున్నారు. టీపీసీబీలో పోస్టులకు జులై 17వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని పరీక్షను సెప్టెంబరులో పెడుతారు. దరఖాస్తుదారులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు నింపి, దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

