కలం, నల్లగొండ : నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Council Chairman Gutta Sukender Reddy) తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారం, సీఎం రేవంత్ ఆదేశాలను పాటిస్తూ నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సొంత ఊరికి సేవ చేస్తే కన్న తల్లికి సేవ చేసిన తృప్తి కలుగుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను బాధ్యతగా పంపించాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత వారిదని ఆయన హామీనిచ్చారు.
నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం తాను నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు. శనివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్, రూ.10 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం భవనాలను అలాగే గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ప్రారంభించారు. ఈ నెల 20 తేదీ నుంచి 26 వ తేదీ వరకు ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో ఉచిత కంటి పొర వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామని, రోజుకు 200 వందల మందికి ఉచిత భోజన వసతి, వైద్య పరీక్షల వసతి కల్పిస్తున్నట్లు గుత్తా తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేరువ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షల కోసం మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేశ్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మండల ప్రత్యేక అధికారి వినోద్, ఇంచార్జ్ ఎంపీడీఓ మనోహర్, స్థానిక సీనియర్ నేతలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

