కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న పహడ్పుర్ గ్రామంలో పర్యటించారు. గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆచారాలు, సంప్రదాయాల గురించి రాష్ట్రపతి స్వయంగా ప్రధానికి వివరించగా ఆసక్తిగా విన్నారు. ఇలాంటి విభిన్న సంస్కృతులే దేశానికి గొప్ప ఆభరణాలని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తు తరాలు ఈ సంప్రదాయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. విద్య పట్ల రాష్ట్రపతికి ఉన్న శ్రద్ధకు ఈ విద్యాలయం గొప్ప ఉదహరణ అని కొనియాడారు.
రాష్ట్రపతి కుటుంబసభ్యుల విగ్రహాల సందర్శన..
పర్యటనలో భాగంగా ప్రధాని రాష్ట్రపతి కుటుంబసభ్యుల విగ్రహాలను సందర్శించి నివాళులర్పించారు. శ్యామ్ చరణ్ ముర్ము, లఖాన్ ముర్ము, సిపున్ ముర్ము విగ్రహాల వద్ద పూలమాలలు వేశారు. రాష్ట్రపతి వరుసగా తన కుటుంబసభ్యులు కోల్పోయారని.. వ్యక్తిగత జీవితంలో ఎంతో క్షోభ అనుభవించినా మనోధైర్యంతో అత్యున్నత స్థాయికి ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సేవ పట్ల రాష్ట్రపతికి ఉన్న మమకారానికి ఇది నిదర్శనమన్నారు.

