కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ జర్నలిస్ట్ మూర్తి (Journalist Murthy) వ్యవహారశైలిపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసిన తప్పులకు గాను మూడు నెలల పాటు సస్పెన్షన్ విధించినప్పటికీ, ఆయన ధోరణిలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ అధ్యక్షులు వై.జె. రాంబాబు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా పీఆర్వోల పట్ల మూర్తి అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు.
కంటెంట్ పంపించకపోతే తన మార్గాల ద్వారా తెచ్చుకుంటానని, భవిష్యత్తులో చూసుకుంటానని పీఆర్వోలను మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాంబాబు స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలోనూ పద్ధతి మార్చుకోకుండా ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఇకనైనా తన ధోరణిని మార్చుకోవాలని, లేనిపక్షంలో మూర్తిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

