హరీశ్ రావు పర్యటన.. నర్సంపేటలో ఉద్రిక్తత

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట(Narsampet)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  జిల్లాలోని అశోక్‌నగర్ గ్రామంలో ఉన్న చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసానికి గురైన ఘటనపై రాజకీయంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకోవాలని హరీశ్ రావు భావించారు.

అడ్డుకున్న పోలీసులు

హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామంలో భారీగా ఏర్పాట్లు చేపట్టాయి. రోడ్డుపై టెంట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నాయకుడికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. అయితే అనుమతులు లేవంటూ పోలీసులు టెంట్లను తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టెంట్లు తొలగించడాన్ని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో కొంతసేపు పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.

దేవాలయాన్ని రక్షించరా?

చారిత్రక శివాలయం ధ్వంసంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేవాలయ పరిరక్షణలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. హరీష్‌రావు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోందని కూడా వారు మండిపడ్డారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో నర్సంపేట రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>