కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని టూరిజం (Telangana Tourism) డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వారసత్వకట్టడాల విశిష్టతను, పురాతన ఆలయాలు గురించి వివరించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు నైపుణ్యం కలిగిన గైడ్ల అవసరం ఉందని గుర్తించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న పర్యాటక గైడ్ పోస్టుల భర్తీకి, శిక్షణా కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. పర్యాటక ప్రాంతాల్లో గైడ్లుగా పనిచేసేందుకు డిగ్రీ అర్హత, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారి నుంచి పర్యాటక శాఖ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పర్యాటక ప్రదేశంపై వివరంగా చెప్పే అర్హత ఉన్నవారు, చారిత్రక, దేవాలయ విశిష్టతను శ్రోతలకు వినసొంపుగా చెప్పే ప్రతిభ ఉన్నవారికి పర్యాటక శాఖ ప్రాధాన్యతనిస్తోంది. దీనిపై ఆసక్తి ఉన్నారు వెంటనేఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. పర్యాటకులు ఒక చారిత్రక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఆ కట్టడం వెనుక ఉన్న చారిత్రక విషయాల్ని , దాని నిర్మాణ శైలిని, ప్రాముఖ్యతను వివరించడానికి ఒక సమర్ధుడైన గైడ్ అవసరం ఎంతైనా ఉంది. ఈ పర్యాటక శాఖ చేపట్టనున్న శిక్షణా కార్యక్రమం ద్వారా పర్యాటకులకు నాణ్యమైన సమాచారాన్ని అందించడమే కాకుండా వారసత్వ సంపదను కాపాడినవాళ్ళం అవుతామని భావిస్తోంది. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పర్యాటక శాఖ కృషి చేస్తోంది.

