కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆదాయం (Telangana Revenue) క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో రూ. 4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే నెలలో రూ. 3,433 కోట్ల ఆదాయం రాగా.. ఇప్పుడు రూ.1,188 కోట్లు అదనంగా వసూలు కావడం గమనార్హం. తెలంగాణలో జీఎస్టీ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఒక నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. జీఎస్టీతో పాటు పెట్రోల్, మద్యంపై వ్యాట్, వృత్తి పన్నులను కలుపుకుని ఏప్రిల్ నెలలో ఆదాయం రూ. 7,570 కోట్లకు చేరింది. గత నాలుగు నెలలుగా తెలంగాణ జీఎస్టీ ఆదాయం స్థిరంగా రూ. 4 వేల కోట్లకు పైగానే నమోదవుతోందని వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. దేశంలో పన్ను వసూళ్ల వృద్ధి రేటులో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
కొత్త పెట్టుబడులు రావడంతోనే..
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా, రాష్ట్రంలో కీలక రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వ్యాపార అనుకూల వాతావరణం వలన కొత్త పెట్టుబడులు రావడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని విశ్లేషిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల పన్నులు చెల్లించడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. పన్ను చెల్లింపుదారులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని వాణిజ్య పన్నుల కమిషనర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

