కలం, వెబ్ డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు (Rain Alert) జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. గత రాత్రి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వర్షం కురుస్తోంది. జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కుండ పోత వర్షం పడుతోంది. హైదరాబాద్ మహానగరంలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడడంతో రాత్రి నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికుల రాకపోకలకు కాస్త అంతరాయం కలిగింది.
రాష్ట్రంలో గురువారం వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో మిరప రైతు రాములు(27) పిడుగుపాటుకు మృతి చెందాడు. వికారాబాద్ జిల్లాలో 300 మేకలు చనిపోయాయి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లో మక్క పంట పూర్తిగా నేలకొరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురుగాలుల ధాటికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడమే కాకుండా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా వైరాలో 2.51 సెం.మీ, జోగులాంబ -గద్వాల జిల్లా రాజోలిలో 2.39 సెం.మీ, అయిజాలో 1.34 సెం.మీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్లో 1.57 సెం.మీ చొప్పున బుధవారం వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.
Read Also: తిరుపతిలో ఆర్టీసీ బస్సులు ఢీ: 10 మందికి గాయాలు
Follow Us On: X(Twitter)

