కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఒకటి రెండు సంఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసే నాటికి మొత్తం 73.33 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలో ఉన్నవాళ్లకు సాయంత్రం 5గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోనూ ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగింది.
జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా 1,35,910 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అశ్వరావుపేట మున్సిపాలిటీలో (Aswaraopeta Municipality) 76.20 శాతం, కొత్తగూడెం కార్పొరేషన్లో 74.19 శాతం, ఇల్లందు మున్సిపాలిటీలో 68.44 శాతం పోలింగ్ నమోదైంది.
అశ్వరావుపేటలో మొత్తం 16,850 మంది ఓటర్లలో 12,839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లలో 99,992 మంది, ఇల్లందులో 33,723 మంది ఓటర్లలో 23,079 మంది ఓటు వేశారు.
జిల్లాలో (Bhadradri Kothagudem) కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వరావుపేట మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఓటు హక్కు వినియోగించుకున్నారు. అశ్వారావుపేటలో అధికంగా 76.20శాతం పోలింగ్ నమోదవగా, ఇల్లందులో తక్కువగా 68.44 శాతం మంది ఓటింగ్ నమోదైంది.
మొత్తం మీద జిల్లాలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.
Read Also: దొంగఓట్ల విషయంలో ఈసీ ఫెయిల్ : జగ్గారెడ్డి
Follow Us On : WhatsApp


