కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థకు రైతు డిస్కమ్ (Rythu DISCOM) అని పేరు పెట్టింది. చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో నలుగురు డైరెక్టర్లు ఉండేలా కేంద్ర ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ కేంద్రంగా రైతు డిస్కమ్ పనులు నిర్వహించనున్నది. ప్రభుత్వ పథకాలకు అవసరమయ్యే విద్యుత్ వ్యవహారాలన్నింటినీ చూసుకునేలా కొత్త డిస్కమ్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ పంపు సెట్లు, మిషన్ భగీరథ, జల మండలి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మున్సిపల్ వాటర్ కనెక్షన్లు తదితరాలన్నీ ఈ డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ముషార్రఫ్ ఆలీ ఫారూకీని ఈ కొత్త డిస్కమ్కు సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
గవర్నర్కు అత్యధిక షేర్లు :
కొత్త డిస్కమ్ను మొత్తం 50 లక్షల షేర్లతో రిజిస్టర్ చేసింది. ఇందులో ఏడుగురికి తలా ఒక షేర్ ఇచ్చి మిగిలిన 49,99,993 షేర్లను గవర్నర్ పేరుమీదనే ఉంచింది ప్రభుత్వం. గవర్నర్ తరఫున సహాయ కార్యదర్శి ఈ షేర్ల నిర్వహణను చూసుకుంటారు. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్ కో సీఎండీ, రైతు డిస్కమ్ సీఎండీ, దక్షిణ డిస్కమ్ సీఎండీ, ఉత్తర డిస్కమ్ సీఎండీ, దక్షిణ డిస్కంలోని ఫైనాన్స్ విభాగం డైరెక్టర్, ఉత్తర డిస్కమ్లోని ఫైనాన్స్ డైరెక్టర్ తలా ఒక షేరు చొప్పున ఉంచుకుంటారు.

