కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడి పుష్కర కాలమైనా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్లో పేరుకుపోయిన కేసుల గురించి ఏపీ ప్రభుత్వం పట్టించుకోనే లేదు. దీర్ఘకాలంగా ఆ కేసులకు సంబంధించిన వివరాలను, ఫైళ్లను అడగనే లేదని, దీంతో ఇక అవి ఇక్కడ ఉండి ఉపయోగం కూడా లేదని భావించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వాటిని ఆ రాష్ట్రానికి బదిలీ చేసింది. మొత్తం 9,378 కేసులకు సంబంధించిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి తరలించింది. రాష్ట్ర విభజనతో ప్రారంభమైన పరిపాలనా విభజన ప్రక్రియలో ఇదో కీలక అధ్యాయం. ఇప్పటిదాకా ఏపీ పరిధిలోకి వెళ్ళే పెండింగ్ కేసుల ఫైళ్లు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (Telangana HRC) కార్యాలయంలోనే ఉండిపోయాయి. బదిలీ చేసిన కేసుల వివరాలను తెలంగాణ కమిషన్ తన వెబ్సైట్లో ఉంచింది. ఇకపై ఆ కేసులకు సంబంధించిన సమాచారం, తదుపరి చర్యల కోసం సంబంధిత ఫిర్యాదుదారులు నేరుగా ఏపీ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
ఉమ్మడి రాష్ట్ర విభజన (State Division) సందర్భంగా 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక శాఖల తరహాలోనే మానవ హక్కుల కమిషన్ వ్యవహారాలు కూడా సుదీర్ఘకాలం స్పష్టత లేకుండా కొనసాగాయి. కమిషన్ సిబ్బంది, చైర్మన్ నియామకాలు, కేసుల విభజన, అధికార పరిధి వంటి అంశాల్లో జాప్యాలు అప్పట్లో చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో ఈ కమిషన్ ఉమ్మడి కమిషన్గా పనిచేసింది. రెండు రాష్ట్రాలకూ సేవలు అందించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రత్యేకంగా కమిషన్ (Telangana HRC) ఏర్పాటైంది. ఇప్పుడు ఫైళ్లు, కేసుల బదిలీతో విచారణ దశకు సంబంధించిన ప్రోగ్రెస్, తదుపరి తేదీలు, నోటీసులు, విచారణ వివరాల కోసం కొత్త వ్యవస్థను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కేసుల స్వీకరణ, వేగవంతమైన విచారణ, పెండింగ్ తగ్గింపు వంటి అంశాల్లో ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను వ్యవహరిస్తుందన్నది బాధితులకు కీలకంగా మారనుంది.
Read Also: విదేశి ప్రయాణాలపై ట్యాక్స్లు విధించం : మోదీ
Follow Us On: WhatsApp

