కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ రాష్ట్రంలో పారదర్శకంగా, తప్పుల్లేకుండా జరగాలని, ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) రిక్వెస్టు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారడంతో అది తెలంగాణలో రిపీట్ కాకుండా, విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా బీఎల్ఓలకు పటిష్టమైన శిక్షణ ఇచ్చి పూర్తి చేయాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను, రాజ్యాంగ స్ఫూర్తిని గమనంలోకి తీసుకుని అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి డిలీట్ కాకుండా చూడాలని కోరారు. ఒక ఓటరు పేరును తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని, క్షుణ్ణంగా ధృవీకరించుకున్న తర్వాతనే తొలగింపుపైనా, చేర్చడంపైనా బీఎల్వోలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీఈఓను ఆయన కార్యాలయంలో కలిసి 22 ప్రతిపాదనలతో ఒక మెమొరాండంను సమర్పించారు. అందులో ఆయన పేర్కొన్న కొన్ని కీలకమైన ప్రతిపాదనలు :
• గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. దశలవారీ ప్రణాళిక అవసరం. ఎస్ఐఆర్ ప్రక్రియను తొందరపాటుగా కాకుండా దశలవారీగా, సమగ్ర ప్రణాళికతో చేపట్టాలి.
• తొందరపడి రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయాలనే హడావిడి వద్దు. రెండేళ్ల వరకూ సమయం ఇవ్వాలి. అభ్యంతరాల పరిష్కారం, ప్రజల అవగాహన, పరిపాలనా ఒత్తిడి తగ్గుతాయి.
• ఇప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతున్నది. అది పూర్తికాకముందే ‘సర్’ రూపంలో మరో భారం వద్దు.
• ఓటర్ల తొలగింపులపై కఠిన నిబంధనలుండాలి. పేర్లను తొలగించడానికి ముందే వారం రోజుల గడువుతో రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత స్పందనకు నెల గడువు ఇవ్వాలి. సాఫ్ట్వేర్ వ్యత్యాసాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్, డూప్లికేట్ ఫొటోల ఆధారంగా పేర్లు తొలగించకూడదు. ఫిజికల్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా చేయాలి.
• ప్రీ-ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేయకుండా కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి ఒకచోట కూర్చుని మ్యాపింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సరైన ధృవీకరణ లేకుండానే మ్యాపింగ్ చేస్తే నిజమైన ఓటర్లకు ఇబ్బందులు వస్తాయి.
• కొంతమంది బీఎల్ఓలకు గౌరవ వేతనాలు సకాలంలో అందడంలేదు. విధి నిర్వహణపై ప్రభావం పడుతున్నది.
• ప్రతి బూత్లో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నమోదు డ్రైవ్ నిర్వహించాలి. శిక్షణ పూర్తయ్యాకే ధృవీకరణ ప్రక్రియ ప్రారంభించాలి. ఓటర్ల జాబితాలను నిర్దిష్ట ఫార్మాట్లలో రాజకీయ పార్టీలకు అందించాలి.
• 2002 తర్వాత తెలంగాణకు వలస వచ్చినవారిపై సానుకూల దృష్టితో వ్యవహరించాలి. కనీసం రెండు ఎన్నికల్లో స్థానికంగా ఓటు వేసినవారికి అఫిడవిట్ ఆధారంగా అవకాశం ఇవ్వాలి.
• కొన్ని ప్రాంతాల్లో బీఎల్ఓల లాగిన్ వివరాలను ఉపయోగించి రాజకీయ నాయకులు అర్ధరాత్రి మ్యాపింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.

