కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. వాతావరణశాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
వైద్య సిబ్బందికి సూచనలు
ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు. తాగు నీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బతో ఎవరైనా ఆసుపత్రుల్లో చేరితే తగిన వైద్య సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయకుండా ఉండాలని సీఎం రేవంత్ ప్రజలకు సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

