కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అసంక్రమిత వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన స్క్రీనింగ్ పరీక్షల్లో (Health Survey) షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడినవారు దాదాపు 26.90 లక్షల మంది రక్తపోటు (BP) సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. అదేవిధంగా సుమారు 14 లక్షల మంది మధుమేహం బారిన పడ్డారని తెలంగాణ సామాజిక ఆర్థిక ముసాయిదా 2026 నివేదిక స్పష్టం చేసింది. ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూడవ దశలో భాగంగా 2024-25 మధ్య కాలంలో మొత్తం 1.37 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వ్యాధుల తీవ్రతను ముందే గుర్తించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయిన వారందరినీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ కింద నమోదు చేస్తుంది. వారికి అవసరమైన ఉచిత చికిత్స, మందులను క్లినిక్స్ ద్వారా అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల వ్యాధి ముదిరి ప్రాణాపాయం కలగకముందే నియంత్రించే అవకాశం కలుగుతోంది.
మరోవైపు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని 46 లక్షల మంది పొదుపు సంఘాల (SHG) మహిళలకు కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్యాన్సర్, టీబీ వంటి 30 రకాల పరీక్షలను వీరికి నిర్వహించనున్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో భాగంగా ప్రజారోగ్య రక్షణ కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.

