కలం, వెబ్ డెస్క్: రోజురోజుకు లంగ్ క్యాన్సర్ (Lung Cancer) కేసులు పెరుగుతున్నాయి. కానీ అందుకుగల కారణం ఏమిటి? అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో లంగ్ క్యాన్సర్ మూలాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేక అధ్యయనం మొదలైంది. అందులో విస్తుబోయే విషయాలు వెలుగుచూశాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల్లో కణతులు ఎంత వేగంగా పెరుగుతాయనే అంశంపై జరిగిన ఒక భారీ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1,693 మంది రోగులపై జరిపిన ఈ అధ్యయనంలో, దాదాపు 18 శాతం మందిలో అత్యంత వేగంగా పెరిగే క్యాన్సర్ రకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముఖ్యంగా 400 రోజుల కంటే తక్కువ సమయంలోనే కణితుల పరిమాణం రెట్టింపు అవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
వేగవంతమైన వృద్ధికి కారణాలు:
ఈ పరిశోధన ప్రకారం, సాధారణ కణజాలం కంటే ‘సాలిడ్ నోడ్యూల్స్’ (Solid Nodules) ఉన్నవారిలో క్యాన్సర్ (Lung Cancer) 41 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు తేలింది. పురుషులు, ధూమపాన అలవాటు ఉన్నవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. ముఖ్యంగా సబ్సాలిడ్ కణితులు ఉన్నవారిలో ధూమపానం మాత్రమే ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్గా నిలిచింది.
జన్యుపరమైన కారణాలు:
సుమారు 128 మంది రోగులకు చేసిన జన్యు పరీక్షల్లో ‘TP53’ అనే జన్యువులో వచ్చే మార్పులు (Mutations) క్యాన్సర్ వేగంగా పెరగడానికి కారణమవుతున్నాయని స్పష్టమైంది. ఈ జన్యుపరమైన మార్పులు కణితి వృద్ధిని వేగవంతం చేస్తాయని, దీనివల్ల చికిత్స మరింత సవాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వైద్యరంగంలో మార్పులు:
క్లినికల్, రేడియోలాజికల్, జెనెటిక్ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అధిక రిస్క్ ఉన్న రోగులను ముందుగానే గుర్తించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ధూమపాన చరిత్ర ఉండి, సాలిడ్ నోడ్యూల్స్ ఉన్నవారికి తరచుగా ఇమేజింగ్ పరీక్షలు చేయడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కారకాలను స్క్రీనింగ్ ప్రోటోకాల్స్లో చేర్చడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
Read Also: AI సాయంతో 26 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా అంటే..?
Follow Us On: X(Twitter)

