కలం డెస్క్ : వరి పండించే రైతులకు (Telangana Farmers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సన్న రకం (Fine Variety) వడ్లు పండించిన రైతులకు బోనస్ (Bonus) ప్రకటించింది. దీంతో సుమారు 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే ఆర్థిక శాఖ (Finance Department) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 649.84 కోట్లను విడుదల చేస్తుంది. రేపటి నుంచే (డిసెంబరు 20న) రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాలకు 268 చెక్కుల ద్వారా నిధులు సంబంధిత అధికారుల ఖాతాల్లోకి చేరాయి. ఆ అధికారులు రైతుల వివరాల డాటా ప్రకారం శనివారమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
ప్రతి క్వింటాల్ సన్న రకం వడ్లకు ప్రభుత్వం రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఒకవైపు సన్న రకం వడ్లను పండించాలని రైతులను (Telangana Farmers) ప్రోత్సహించడంతో పాటు వారు ఉత్పత్తి చేస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి రేషను దుకాణాల ద్వారా పేదలకు సరఫరా చేస్తున్నది. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళలోనూ సన్న బియ్యాన్నే వినియోగించేలా ఆదేశాలు ఇచ్చింది. రైతుభరోసా రూపంలో రైతులకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున సాయం అందుతున్నా ప్రతీ ఎకరానికి సగటున 25 క్వింటాళ్ళ సన్న వడ్ల ఉత్పత్తితో రూ. 12,500 చొప్పున లబ్ధి చేకూరనున్నది.
Read Also: ఒక్క ఊరు.. కానీ మూడు జిల్లాలు
Follow Us On: Youtube

