కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతపై (Women Empowerment) ప్రత్యేక దృష్టి సారిస్తూ పలు కీలక కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణ పరిమితి పెంపు, వడ్డీ లేని రుణాల మంజూరు, అలాగే పెట్రోలు బంకుల నిర్వహణకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేయనున్నారు.
ప్రత్యేకంగా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్టీసీ తరఫున 553 అద్దె బస్సులను అప్పగించనున్నారు. వీటికి సీఎం చేతుల మీదుగా ‘ఫ్లాగ్ ఆఫ్’ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపించారు. సమయం చూసుకుని సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మహిళా సంఘాల కోసం నిర్మించిన సొంత భవనాల కార్యక్రమం కూడా ఈ వారోత్సవాలలో భాగంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే 100 భవనాలు సిద్ధంగా ఉండగా, వీటిని సీఎం వర్చువల్ లేదా ప్రత్యక్షంగా ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలోనే 8 వేల గ్రామాలలో మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అదనంగా 82 అంగన్వాడీ కేంద్ర భవనాలను కూడా ప్రారంభించనున్నారు.
ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఈ వేడుకలలో భాగంగా ఉండనుంది. హైదరాబాద్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ప్రారంభానికి కూడా ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో మహిళా వారోత్సవాలపై పూర్తి దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో ‘లోన్ మేళా’ల ద్వారా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సాధికారత (Women Empowerment), ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి పెంపు వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహిళల శక్తి సమాజ అభివృద్ధికి కీలకమని సీఎం, మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.
Read Also: ఫ్యూచర్ సిటీ వివాదం.. ట్రబుల్లో ట్రబుల్ షూటర్ హరీశ్రావు
Follow Us On: X (Twitter)

