కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలోని ప్రముఖ క్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) ఆలయాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. 200 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని భక్తుల మనోభావాలకనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్ ప్లాన్కు తుదిరూపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో ఘాట్లతోపాటు మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే భద్రాచలం సమీపంలోని ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుచేస్తామన్నారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా కొరివి వీరభద్రస్వామి ఆలయం, మల్లూరులోని నరసింహాస్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొన్నారు.

