కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ఉత్సాహంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (MPTC – ZPTC Elections) నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రక్రియను ముగించేయాలని భావిస్తున్నది. పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నిర్వహణపై ఇన్ఫార్మల్గా డిస్కస్ చేసి కొలిక్కి తెచ్చే అవకాశమున్నది. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి స్పష్టమైన నిర్ణయం జరగొచ్చని పార్టీ వర్గాల సమాచారం. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాహుల్గాంధీ ఢిల్లీలో గురువారం సమావేశం సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల స్టేట్ టీమ్ను అభినందించారు.
ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్ షిప్ట్ :
తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికలను (GHMC Elections) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం వీలైనంత తొందరగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ముగించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర నేతలతో ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత దాదాపుగా ఈ విషయంలో పాజిటివ్ సంకేతాలు వెలువడినట్లు తెలిసింది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం హైకోర్టు పరిధిలోకి వెళ్ళంది. మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేంత వరకు ఎన్నికలు సాధ్యం కాదనే అభిప్రాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యమవుతాయనే ఉద్దేశంతో బడ్జెట్ సమావేశాల్లోపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముగించడం బెటర్ అనే వాదనలు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. క్యాబినెట్ భేటీ తర్వాత క్లారిటీ రానున్నది.
ఎన్నికలకు ముందే రైతుభరోసా నిధులు :
స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరు ఎక్కువ ప్రభావం చూపుతుందని స్వయంగా రాహుల్గాంధీ చెప్పడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు (MPTC – ZPTC Elections) వెళ్ళడానికి ముందే రైతుభరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశమున్నది. ఎలాగూ బడ్జెట్ సెషన్ వస్తున్నందున అప్పటివరకూ ఆగకుండా ఇప్పుడే ఫండ్స్ రిలీజ్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రెండేండ్ల పనితీరును ఏఐసీసీ నేతలు సమీక్షించడంతో పాటు ఆయా శాఖల వారీగా మంత్రులు తీసుకున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వరి సాగు, దిగుబడి, సంక్షేమానికి చేస్తున్న ఖర్చు తదితరాలన్నింటిపై రాహుల్గాంధీ, ఖర్గే ఆరా తీశారు. మున్సిపల్ ఎన్నికల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినందున మంత్రులంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
Read Also: ‘సిద్ధిపేట వేదిక’… కవిత సంచలన సవాల్!
Follow Us On : WhatsApp


