కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు (జగన్నాథపురం) వద్ద శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పాల్గొనబోయే ఈ భారీ బహిరంగ సభా వేదికకు సమీపంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీ (YS Jagan flexi) దర్శనమిస్తోంది.
మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద సభా ప్రాంగణానికి కూతవేటు దూరంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ పక్కనే రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్ అభిమానులు ఈ ఫ్లెక్సీను ఏర్పాటు చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ‘రైతు ఆశీర్వాద సభ’కు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా, సరిహద్దు ప్రాంతాల నుండి కూడా భారీగా జనం తరలివస్తున్నారు. ఈ క్రమంలో సభకు వస్తున్న ప్రజలందరి దృష్టిని ఈ ఫ్లెక్సీ విశేషంగా ఆకర్షిస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక సభ జరుగుతున్న వేదిక పరిసరాల్లో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీ దర్శనమివ్వడం స్థానికంగా, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తరఫున నిర్వహించే ఈ సభలో ఇలాంటి భిన్నమైన రాజకీయ చిత్రాలు కనిపించడం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

