కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేట్లోని నియోపోలిస్ (Neopolis) ప్రాంతంలో తాగు నీటి సదుపాయాల అభివృద్ధి కోసం ఖానాపూర్ క్యాంపస్ వద్ద అదనంగా 3.95 ఎకరాల భూమిని హైదరాబాద్ జలమండలికి కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న జనాభా వృద్ధి, వెర్టికల్ అర్బనైజేషన్ కారణంగా తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గోదావరి నది జలాలను వినియోగిస్తూ నగరానికి అదనంగా 300 ఎంజీడీ నీటిని అందించే ప్రాజెక్ట్ను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3లతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపడం, మూసీ నది పునరుజ్జీవానికి (Musi Rejuvenation) చర్యలు తీసుకుంటోంది. కోకాపేట్ నియోపోలిస్ (Neopolis) లేఅవుట్లో సంప్, పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, జీఎల్ఎస్ఆర్, ఎస్టీపీ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఖానాపూర్లో జల మండలికి ఉన్న 8.75 ఎకరాల భూమి 22.5 ఎంఎల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 2 ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు, క్లోరినేషన్ గది నిర్మాణాలకు మాత్రమే సరిపోవడంతో అదనపు భూమి అవసరం ఏర్పడింది.
దీంతో హెచ్ఎండీఏ (HMDA) గుర్తించిన ఓహెచ్టీ కోసం 1.18 ఎకరాలు, సైట్ ఆఫీస్ కోసం 0.77 ఎకరాలు, ఆశ్రమానికి చెందిన 2 ఎకరాలు మొత్తం 3.95 ఎకరాల భూమిని జలమండలికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 592 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భూభాగం టోపోగ్రఫీ పరంగా మొత్తం సర్వీస్ ప్రాంతానికి గ్రావిటీ విధానంలో నీటి సరఫరా చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా నియోపోలిస్, కోకాపేట్ పరిసర ప్రాంతాలతో పాటు బోజగుట్ట రిజర్వాయర్కు కూడా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయవచ్చు. అదే విధంగా ఓల్డ్ సిటీ, షేక్పేట్, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు పంపింగ్ అవసరం లేకుండా తాగునీరు అందించవచ్చు. దీని వల్ల కరెంట్ చార్జీలు కూడా ఆదా అవుతాయి.
Read Also: ఇరాన్ పై ఇజ్రాయెల్ మెరుపు దాడి: టెహ్రాన్ లో క్షిపణుల వర్షం
Follow Us On: X(Twitter)

