కలం, జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) భూ భారతి (Bhu Bharati) పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. శనివారం ఉదయం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న స్కాంతో పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. నిషేధిత భూములను తీసేస్తామని చెప్పి, వాటి వివరాలను దాచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాను పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేధిత జాబితా పేరుతో పెద్ద కుంభకోణమే జరుగుతోందని చెప్పారు. తమకు సెటిల్మెంట్ కాగానే నిషేధిత జాబితా నుండి భూములను తొలగిస్తున్నారని పేర్కొన్నారు.
నిషేధిత భూముల జాబితా ముసుగులో విలువైన భూములను ఆ లిస్ట్లో చేరుస్తున్నారని హరీశ్ ఆరోపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలు వసూళ్లకు పాల్పుడుతున్నారని వెల్లడించారు. భూ భారతి స్కామ్లో అసలు నిజాలు బయటకు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. మొత్తం 35 మండలాల్లో భూ భారతి స్కాం జరిగిందని హరీశ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల మీద సిట్లు వేసే బదులు భూ భారతి స్కాంపై వేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు కేవలం ప్రతిపక్షాలను వేధించడానికే ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే ఎలాంటి కమిషన్ వేయరా? అని నిలదీశారు. సిట్, సీఐడీ విచారణ ఎందుకు చేయించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ భారతి పోర్టల్ ఎడిట్ ఆప్షన్ ఆపరేటర్కు ఎలా దొరికిందని హరీశ్రావు ప్రశ్నించారు. సామాన్యులపై కేసులు పెట్టే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు ఈ కేసును పట్టించుకోవట్లేదన్నారు. పొంగులేటి శాఖ కాబట్టి భయపడుతున్నావా? అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద లేదని సెటైర్లు వేశారు. భూ భారతి స్కాంలో, అమాయక రైతులకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని మండిపడ్డారు. లక్ష ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుందని, ఎన్నికల ముందు పట్టాలిస్తామని చెప్పి ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారని హరీశ్ (Harish Rao) విమర్శించారు. భూ భారతి వెనక ఉన్న అక్రమాలన్నీ త్వరలో బయటపెడతామని వెల్లడించారు.
Read Also: నియో పోలిస్లో జల మండలికి భూ కేటాయింపు
Follow Us On: Youtube

