కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) ముందస్తు క్షిపణి దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఈ నివారణ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తాజా దాడుల ధాటికి టెహ్రాన్ సమీపంలోని పలు ప్రాంతాల్లో భారీగా పొగలు కమ్ముకున్నాయి. టెహ్రాన్ లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు.
అయితే ఈ దాడుల్లో కేవలం ఇజ్రాయెల్ (Israel) మాత్రమే కాకుండా అమెరికా కూడా పాలుపంచుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్పై దాడుల్లో తాము కూడా పాల్గొన్నామని, పలు లక్ష్యాలపై తమ దళాలు విరుచుకుపడ్డాయని అమెరికా ఉన్నతస్థాయి అధికారి ఒకరు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు వెల్లడించారు. దీంతో ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఉమ్మడి పోరుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ (Iran) సైన్యం కూడా అప్రమత్తమైంది. దీంతో ఇజ్రాయెల్ సైతం తమ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
భారతపౌరులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
ఇజ్రాయిల్లోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ (Indian Embassy) అప్రమత్తం చేసింది. అత్యవసర పనులుంటే మాత్రమే బయటకు వెళ్ళాలని, లేదంటే సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ తలెత్తితే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని సూచింది.
Read Also: కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ వాయిదా: కొత్త తేదీలు ఇవే
Follow Us On: Sharechat

