కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సమగ్ర అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) అన్నారు. ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ల నిర్మాణం వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన భూ సేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డి తదితరులతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
వరంగల్ ఎయిర్ పోర్టుకు (Warangal Airport) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని తెలిపారు. వీలైనంత త్వరలో శంకుస్ధాపన చేస్తామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయని ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్కు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై ఒక నివేదిక రూపొందించాలని పొంగులేటి (Minister Ponguleti) సూచించారు.
Read Also: విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp

