కలం, వెబ్ డెస్క్: అటవీ శాఖ (Forest Department) సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వన మహోత్సవం – 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద సంరక్షణలో ప్రాణాలకు తెగించి పోట్లాడుతున్న సిబ్బందిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ వన సంరక్ష మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్–2026ను ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు. ఏటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీన లేదా ప్రభుత్వం నిర్ణయించిన ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కొత్త విధానానికి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
నాలుగు రకాల పురస్కారాలు, నగదు బహుమతులు..
కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రకాల ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి వన శౌర్య పతకం (ప్రత్యేక బంగారు పతకం), తెలంగాణ విశిష్ట వన సంరక్ష పతకం (బంగారు పతకం), తెలంగాణ ఉత్తమ వన సంరక్ష పతకం (వెండి పతకం), తెలంగాణ వన సంరక్ష పతకము (రజత పతకం) పేర్లతో ప్రవేశపెట్టింది. పతకంతో పాటు నగదు బహుమతి, నెలవారీ ప్రోత్సాహక నగదు కూడా అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వన శౌర్య పథకానికి రూ.25 వేలు, విశిష్ట వన సంరక్ష పథకానికి రూ.20 వేలు, ఉత్తమ వన సంరక్ష పథకానికి రూ.15 వేలు, వన సంరక్ష పథకానికి రూ.10వేల నగదు బహుమతిని అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు. అదనంగా నెలవారీ నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తారు.

