కలం, నిర్మల్ : ఈ నెల 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా ప్రజలకు తక్షణ న్యాయం అందుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డీడీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు వంటి అంశాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

