కలం, వెబ్ డెస్క్ : జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ( PRC ) ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో భాగంగా పెండింగులో ఉన్న బిల్లులను, ఐదు డీఏ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అంతేకాదు రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉద్యోగులు, వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుందని.. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈ జేఏసీ కార్యాచరణ ఉంటుందని చైర్మన్ వి. లచ్చిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు ఇచ్చి ప్రభుత్వానికి నివేదిక చేరేలా చూడటం జరుగుతుందని, మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లుకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.

