కలం, క్రైమ్ బ్యూరో : ఈగల్ టీమ్ (Telangana EAGLE Team) మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలతో పాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో భారీ ఆపరేషన్ చేపట్టిన ఈగల్ టీమ్ డ్రగ్స్ , గంజాయి సేవిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకుంది. వీరికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరంతా చక్రి, హర్షిద్ రెడ్డి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది.
గతంలో చక్రి, హర్షిద్ రెడ్డి ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ వీరి దందా మాత్రం ఆగలేదు. వీరిద్దరూ సుశీల్ , కృష్ణ అనే వ్యక్తులతో కలిసి గోవాలోని వాగటర్ బీచ్ వద్ద ఉన్న ఓ హాస్టల్ను లీజ్కు తీసుకుని ఈ దందా కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బెంగుళూరు నుంచి కోకైన్, ఎమ్డీఎంఏ, ఎల్ఎస్డీ, ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్ను కొనుగోలు చేసి వాటిని గోవా నుండి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారికి కూడా వీరు డ్రగ్స్ , సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా ఈగల్ టీమ్కు పట్టుబడిన వారు చక్రి, హర్షిద్ రెడ్డిలకు డ్రగ్స్ కోసం మొత్తం రూ. 1.46 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు.
మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి పట్టివేత
హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి పట్టుబడింది. దిలీప్ (21) అనే వ్యక్తి వద్ద నుంచి 1 కేజీ గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని మల్కాజిగిరి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

