Mobile Popup Ad
Mobile Popup Ad

వైద్యుల సమ్మె.. నేటి నుంచి ఓపీ సేవలు బంద్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ (TGGDA) రాష్ట్రవ్యాప్త సమ్మె (Telangana Doctors Strike)కు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వైద్యుల సంఘం ప్రకటించింది. బదిలీల ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఇప్పటికే కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వద్ద వైద్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించారు.

వైద్యుల డిమాండ్లు ఇవే..

వైద్యుల ప్రధాన డిమాండ్ల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల జనరల్ బదిలీల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 38 నిబంధనలను వైద్య ఆరోగ్య శాఖలో పటిష్ఠంగా, పారదర్శకంగా అమలు చేయాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలు కల్పించే ‘స్పౌజ్’ (Spouse) కేటగిరీకి ప్రాధాన్యత ఇవ్వాలని, శారీరక వికలాంగులు, వితంతువుల బదిలీల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులను వారి ఇష్టపూర్వక ఆప్షన్లు లేకుండా బలవంతంగా బదిలీ చేయవద్దని, బదిలీల ప్రక్రియను పారదర్శకమైన కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు (Emergency Services) మినహాయింపు ఇచ్చినప్పటికీ, సాధారణ ఓపీ సేవలు పూర్తిగా బంద్ కానుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియలో ఉన్న అస్పష్టతను తొలగించాలని, లేనిపక్షంలో అత్యవసర సేవలను కూడా నిలిపివేసి ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>