కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని అన్నారు. ఒక్క శాతం పెంచినా రూ.వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందనే ఆలోచనతో శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని తెలిపారు. ఎలాంటి అక్రమాలు జరిగేందుకు ఆస్కారం లేకుండా సబ్ రిజిస్ట్రార్ ల అధికారాలను కుదించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2.75 లక్షలుగా నిర్ణయించామని, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎకరానికి 5 లక్షలుగా, హెచ్.యం.డి.ఏ. పరిధిలో 10 లక్షలుగా, ఓ.ఆర్.ఆర్. పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. సవరించిన భూములు విలువలపై ఎక్కువ తక్కువలుంటే మీటింగ్ ఏర్పాటు చేసి చర్చిస్తామని తెలిపారు. సవరించిన భూముల విలువలు, సందేహాలు ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788, వాట్స్ యాప్ నెంబర్ 8247619983 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ రద్దు సాధ్యం కాదు..
ఫ్యూచర్ సిటీ రద్దు చేయడం సాధ్యం కాదని.. ఫ్యూచర్ సిటీ లో భూములు ఉచితంగా ఇవ్వడం లేదని మంత్రి స్పష్టం చేశారు. రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనికాదని అన్నారు. ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అత్యాధునిక సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లష్టర్లుగా విభజించి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా ప్రైవేటు నిర్మాణ రంగ సంస్ధలతో నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణంతో పాటు ఐదు సంవత్సరాల నిర్వహాణా బాధ్యతను కూడా ఆ సంస్ధలకే అప్పగించామన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయమంతమైదని.. నిరుపేదల స్వంత ఇంటి కలలను తీర్చే అవకాశం తనకు దక్కిందని చెప్పారు.

