కలం, వరంగల్ బ్యూరో : అటవీ ప్రాంతాల అభివృద్ధికి రోడ్ల నిర్మాణం ఎంతో కీలకమని, కర్రెగుట్టల్లో (Karregutta) రోడ్లు వేయడం శుభపరిణామమని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. మంగళవారం ములుగు (Mulugu) జిల్లాలో పర్యటించిన ఆయన, వెంకటాపురం మండలం పామునూరు అటవీ ప్రాంతంలో పోలీస్ ఔట్పోస్ట్, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ (DGP Shivadhar Reddy) మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే రవాణా సదుపాయాలు మెరుగుపడాలని, అందులో భాగంగా రోడ్ల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుతం వేగంగా జరుగుతున్న పనులు అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇంత త్వరగా రోడ్ల నిర్మాణం జరగడం విశేషమని, దీని ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ మాట్లాడుతూ.. అటవీ చట్టాలను ఉల్లంఘించకుండా రోడ్ల పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని, గతంలో తాడ్వాయి దాటి ఆ దిశగా అభివృద్ధి చేయలేకపోయామని చెప్పారు. ప్రస్తుతం అడవుల్లోనూ ఎకో టూరిజం అభివృద్ధి సాధ్యమవుతోందని, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని జలపాతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ పర్యటనలో ఐబీ చీఫ్ సుమతి, ప్రిన్సిపాల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ, సీఆర్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఆఖరికి.. వాటర్ ప్యాకెట్స్ కూడా కల్తీనే!
Follow Us On : WhatsApp

