కలం, ఖమ్మం బ్యూరో: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ప్రైవేట్ పోటీని తట్టుకుని నిలబడేలా సింగరేణి 10 ఏండ్ల ప్రణాళికతో ముందడుగు వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉత్పత్తుల వ్యయం తగ్గించుకుంటూ కేవలం బొగ్గుకే పరిమితం కాకుండా ‘గ్రీన్ ఎనర్జీ’ వైపు వేగంగా అడుగులు వేయాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బొగ్గు గనిని గురువారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత, మైనింగ్ విధానాలపై మాట్లాడారు.
130 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి తెలంగాణకు ఆత్మ వంటిదని, బొగ్గు మైనింగ్లో మట్టి, రాళ్ళు కలవకుండా, నాణ్యమైన బొగ్గునే జెన్కోకు అందించాలని స్పష్టం చేశారు. కొత్త కోల్ బ్లాక్ సాధించి తవ్వకాలు ప్రారంభించడానికి 7 నుండి 8 ఏళ్లు పడుతుందని, విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సింగరేణి-జెన్కో కలిసి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అలాగే భవిష్యత్ అవసరాల కోసం సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీతోపాటు సెమీకండక్టర్ల తయారీకి క్రిటికల్, రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్లోకి కూడా సింగరేణి విస్తరించాలని పిలుపునిచ్చారు. భట్టి వెంట ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, జెన్కో సీఎండీ హరీశ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

