కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికి జల వివాదాలు పరిష్కారం కావడం లేదు. తరచుగా ఏదో ఒక విషయం తెరపైకి వస్తూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో పోలవరం అంశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య చర్చకొచ్చింది. పోలవరం (Polavaram) ఫేజ్-2 పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA)కి ఘాటైన లేఖ రాసింది. ప్రాజెక్టు వల్ల భద్రాచలం పట్టణంతోపాటు తెలంగాణలోని అనేక ప్రభావిత ప్రాంతాలకు పొంచి ఉన్న ముంపు ప్రమాదంపై పూర్తిస్థాయి సర్వే ముగిసే వరకు పనులు ముందుకు సాగకూడదని స్పష్టం చేసింది.
ప్రధానంగా 36 వాగుల డ్రైనేజీ వ్యవస్థపై పడే ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని, ఆ నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు కేంద్రం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులను పునఃప్రారంభించడంపై తెలంగాణ (Polavaram) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ పనులను తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.

