కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క (Congress Leaders), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇతర ముఖ్య నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ‘భారతరత్న’ డా.బి.ఆర్. అంబేడ్కర్ అని భట్టి విక్రమార్క కొనియాడారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతో పాటు, మహిళా సాధికారతకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. తెలంగాణలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా మనం చేపట్టిన కుల గణన ద్వారా వనరులు, అవకాశాలను జనాభా ప్రాతిపదికన అందరికీ సమానంగా పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణలో, మానవ హక్కుల సాధనలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ ఆశగా సాధన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోరూపొందించిన ప్రత్యేక బ్రోచర్ను వారు విడుదల చేశారు.

