కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet) సమావేశం జరగనున్నది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులకు పేమెంట్స్, పీఆర్సీ నివేదిక, ఆర్టీసీ విలీనం, వీటికి అవసరమైన నిధులు, విడుదల చేయడానికి క్యాలెండర్ రూపకల్పన తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, రాబోయే వానాకాలం పంట సీజన్కు అవసరమైన యూరియా సరఫరా, రైతులకు వడ్ల బోనస్ తదితరాలపైనా చర్చ జరగనున్నది. ప్రాణహిత ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టాలని ఇటీవల తీసుకున్న నిర్ణయంలో భాగంగా అంచనా వ్యయాన్ని సవరించడంపైనా ఈ సమావేశంలో (Telangana Cabinet) చర్చ జరిగే అవకాశముంది.
రానున్న విద్యా సంవత్సరంలో ఎదురుయ్యే సవాళ్లు, ఫీజుల నియంత్రణ, రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తదితరాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది. గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేయడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం పురోగతి, రాబోయే విద్యాసంవత్సరానికి అవసరమైన ఏర్పాట్లపై కూడా చర్చలు జరగనున్నాయి. ఉద్యోగ నియామకాల పురోగతి, ప్రభుత్వ ఖాళీల భర్తీ, వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు తదితరాలపై కూడా చర్చలు జరగొచ్చు.

